kaleshwaram lift irrigation project all you need to know
కాళేశ్వరం… తెలంగాణ మణిహారం.
ఈ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా గో‘దారి’నే మళ్లించింది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతమని చెప్పొచ్చు. తెలంగాణకు కీర్తి కిరీటంగా నిలిచిన ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన డిస్కవరీ ఛానల్ డాక్యుమెంటరీ రూపంలో జూన్ 25న రాత్రి 8గంటలకు మన ముందుకు తీసుకొస్తుంది. ఇది సీఎం కేసీఆర్.. ఇంజనీరింగ్ నిపుణుల కృషికి.. యావత్ తెలంగాణ సమాజానికి గర్వకారణంగా నిలువనుంది.
ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ గురించి కొన్ని విషయాలు..
బీడు వారిన భూముల కోసం ఏకంగా నదినే మళ్లించింది కాళేశ్వరం ప్రాజెక్ట్
పుడమి తల్లి ఇప్పుడు గోదావరి పంపింగ్తో పరవశిస్తోంది
గోదావరి నుంచి 170 టీఎంసీల నీటి వినియోగం లక్ష్యం
ఈ ప్రాజెక్ట్ తో తెలంగాణలోని 13 జిల్లాలకు లబ్ధి
భారీ ఎత్తిపోతల పథకంలో 28 ప్యాకేజీ ద్వారా పనులు
ఇందులో 7 మెగా లింకులు
హైదరాబాద్కు 30 టీఎంసీల తాగునీరు
ఏకంగా నదిని ఎత్తిపోసే విధంగా ఎంఈఐఎల్ పంపింగ్ వ్యవస్థ
ఇలాంటి పథకాన్ని ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా నిర్మించలేదు
నదిని దిగువ నుంచి ఎగువకు పంపింగ్ చేయడం ఈ పథకంలో ప్రత్యేకత
20 పంపింగ్ కేంద్రాల్లో 22 పంప్హౌస్ల నిర్మాణం
20 పంపింగ్ కేంద్రాల్లో 15 పంపింగ్ కేంద్రాలు నిర్మించిన మేఘా
వీటిల్లో మొత్తం 104 పంపింగ్ మిషన్లు అంటే అన్ని యూనిట్లను రికార్డ్ సమయంలో ఏర్పాటు
ఎక్కడా నిర్మించని విధంగా 518 మీటర్ల ఎత్తుకు రెండు దశల్లో ఎత్తుకు నీటి పంపింగ్
టన్నెల్స్, పైపులైన్లతో కలిపి 1850 కిలోమీటర్ల నీటి సరఫరా నిర్మాణాలు
మొత్తం ఈ ప్రాజెక్ట్ కు 5159 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం
ఇందులో 4439 మెగావాట్ల పంపింగ్ కేంద్రాలు మేఘావే
మేడిగడ్డ లక్ష్మీలో 17, అన్నారం సరస్వతి 12, సుందిళ్ల పార్వతిలో 14, ప్యాకేజీ 8లోని గాయత్రి భూగర్భ పంపింగ్ కేంద్రంలో 7 మిషన్లు
అన్నపూర్ణ కేంద్రంలో 4, రంగనాయకసాగర్లో 4, కొండపోచమ్మ రెండు పంప్హౌస్లో 12 మిషన్ యూనిట్లు
ఇక మల్లన్న సాగర్ జలాశయం నీటి నిల్వ 52 టీఎంసీలు
మల్లన్న సాగర్ పంపింగ్ కేంద్రంలో 8, ప్యాకేజీ-21 లోని రెండు పంప్హౌస్లో 18 మిషన్లు, ప్యాకేజ్-27 లో 4, ప్యాకేజ్-28లో 4 మిషన్ల ఏర్పాటు
20 జలశయాల్లో నీటి నిల్వ ఏర్పాట్లు పూర్తి
37 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ
18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు
నిర్మాణంలో ఎంఈఐఎల్తో పాటు పాలుపంచుకున్న పది దేశీయ, ఐదు అంతర్జాతీయ సంస్థలు
మేడిగడ్డలో 6 మెషిన్లను కేవలం పదినెలల రికార్డు సమయంలో ఏర్పాటు
మేడిగడ్డ లక్ష్మీ పంపింగ్ కేంద్రంలో 17 మెషీన్లు 680 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు ఓ రికార్డ్
లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంపు హౌస్ లో ఒక్కొక్కటీ 40 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 43 మెషీన్లు
లింక్-1 కిందే 1720 మెగావాట్ల విద్యుత్ వినియోగం
ప్రపంచంలోనే పెద్దదైన ప్యాకేజీ 8లోని గాయత్రి భూగర్భ పంపింగ్ కేంద్రంలో 7 మిషన్లు
ఇలాంటి పంపింగ్ కేంద్రం ప్రపంచంలో మరెక్కడా లేదు
ఒక్కొక్క యూనిట్ సామర్ధ్యం 139 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు
ఆ తరువాత రంగనాయక సాగర్ లోని నాలుగు మెషీన్లను ఒక్కొక్కటి 135 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటు
అన్నపూర్ణ పంప్హౌస్లో నాలుగు మెషీన్లు ఒక్కొక్కటి 106 మెగావాట్ల సామర్ధ్యం
కేవలం రెండేళ్లలోనే 260 కిలో మీటర్ల ట్రాన్స్ మిషన్ లైన్లు
400 – 220కేవీ సామర్ధ్యం కలిగిన ఆరు సబ్ స్టేషన్లను అతి తక్కువ కాలంలో పూర్తి
గోదావరి వైపు చూపు.. పాత ప్రాజెక్టుకు కొత్త రూపు
కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి కాదు. ఇది కొన్ని బ్యారేజీలు, పంపు హౌజులు, కాలువలు, సొరంగాల సమాహారం. కానీ, అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవే. గోదావరి నీటిని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టును రూపొందించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదించిన ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రీడిజైన్ చేయించింది.
ముందుగా అనుకున్నట్టు ప్రాణహిత నదిపై కాకుండా కాస్త కిందకు, ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తరువాత ప్రధాన నిర్మాణం సాగేలా రీడిజైన్ చేశారు.
ఒక బ్యారేజీలా కాకుండా 3 బ్యారేజీలు, 19 పంపు హౌజులు, వందల కిలోమీటర్ల కాలువలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోంది.
తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లోని గోదావరి నుంచి దక్షిణాన హైదరాబాద్, చిట్యాల, షామీర్పేట వరకు నీళ్లొచ్చేలా ఈ కొత్త డిజైన్ ఉంది.
తాగునీటికి.. పారిశ్రామిక అవసరాలకు కూడా..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 13 జిల్లాల్లోని 18 లక్షల 25 వేల ఎకరాలకు కొత్తగా నీరిస్తారని అధికారులు చెబుతున్నారు. దారి పొడవునా ఉండే గ్రామాలకు, హైదరాబాద్కు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు ఇవ్వాలనీ ప్రణాళిక రూపొందించారు.
కొత్త ఆయకట్టు కాకుండా శ్రీరాంసాగర్, నిజాం సాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, అప్పర్ మానేరు ప్రాజెక్టులను కూడా ఈ ప్రాజెక్టుతో అనుసంధానించడానికి కొత్తగా కాలువలు, సొరంగాలు, పంపు హౌజులు తవ్వారు.
వీటి ద్వారా మిగిలిన నీటిని తరలించి ఆయకట్టును స్థిరీకరిస్తారు. అంటే ఆ రిజర్వాయర్ల కింద ఉన్న 18.82 లక్షల ఎకరాల ఆయకట్టుకు నికరంగా నీరందించవచ్చని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
వీటికి అదనంగా, పాత ప్రాణహిత ప్రాజెక్టు ప్రతిపాదించిన చోటే అప్పటికంటే ఎత్తు తగ్గించి మరో బ్యారేజీ నిర్మిస్తున్నారు. అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 2 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా దీన్ని రీడిజైన్ చేశారు.
గోదావరి నీటిని గోదావరిలోనే కలిపేలా..
నదిలో నీటి ప్రవాహాన్ని ఆపడానికి కట్టే నిర్మాణాన్ని బ్యారేజ్ అంటారు. నదిలోనే జలాశయం కూడా నిర్మిస్తే డ్యామ్ అంటారు. (ఉదాః నాగార్జున సాగర్ డామ్, ప్రకాశం బ్యారేజ్).
ఇప్పుడు గోదావరిపై మూడు చోట్ల (మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం) బ్యారేజ్లు కడుతున్నారు. ఒక బ్యారేజ్లో నిల్వ ఉన్న నీటిని పంపుహౌజు నుంచి తోడి కాలువ ద్వారా మరో బ్యారేజ్ ముందుకు వదిలేలా ఏర్పాటు ఉంటుంది. (గోదావరి ప్రవాహానికి వ్యతిరేక దిశలో, ఎగువకి) ఇలా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకూ నీటిని తెస్తారు. అక్కడి నుంచి కాలువల ద్వారా నీటిని పంపిస్తారు.
అలా నీరు సొరంగాలు, కాలువల్లో ప్రవహించి, పంపుహౌజుల్లో లిఫ్టు చేసి భూమి లోపల, బయట ప్రయాణించి వేర్వేరు కొత్త, పాత జలాశయాలను కలుపుతూ దక్షిణ తెలంగాణ వరకూ వస్తుంది.
ఒక్కముక్కలో చెప్పాలంటే అవసరానికి అనుగుణంగా గోదావరి నీటిని కాలువలోకి మళ్లించి, గోదావరి ప్రవాహానికి వ్యతిరేక దిశలో (వెనక్కు) తీసుకెళ్లి మళ్లీ గోదావరిలోనే కలుపుతారు. ఇదంతా కాళేశ్వరం లింక్ -1 లో జరుగుతుంది.
అక్కడి నుంచి కాలువల ద్వారా అనుకున్న చోటుకు తరలిస్తారు. ఇందుకోసం వివిధ చోట్ల యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పాత చెరువులు, రిజర్వాయర్లను, కాలువలను బాగు చేశారు. మరికొన్ని చోట్ల కొత్తగా కాలువలు, సొరంగాలు, పంపు హౌజులు, రిజర్వాయర్లు నిర్మించారు.
ఈ మొత్తం పనిని లింకులుగా, తిరిగి ఆ లింకులను ప్యాకేజీలుగా విభజించారు. మొత్తం ఈ ప్రాజెక్టులో 7 లింకులు 28 ప్యాకేజీలు ఉన్నాయి.
ప్రస్తుతం లింక్ 1, లింక్ 2 పనులు వేగంగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
లింక్ 1, లింక్ 2 లలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, వాటికి అనుబంధంగా ఉండే పంపుహౌజులు, ధర్మారం, రామడుగు గ్రామాల దగ్గర్లో భూగర్భంలో నిర్మిస్తోన్న పంపుహౌజులు ఉంటాయి.
అంకెల్లో ప్రాజెక్టు వివరాలు
నీటి సరఫరా మొత్తం మార్గం: 1832 కి.మీ
మామూలు కాలువల పొడవు: 1531 కి.మీ
సొరంగాలు (భూగర్భ కాలువలు) పొడవు: 203 కి.మీ
పైపులైన్ పొడవు: 98 కి.మీ
మొత్తం లిఫ్టులు: 20
పంపు హౌజ్లు: 19
అవసరమయ్యే విద్యుత్తు: 4627.24 మెగావాట్లు
మొత్తం విద్యుత్ సబ్ స్టేషన్లు: 17
అతి పెద్ద పంపుల సామర్థ్యం: 139 మెగావాట్లవి 7 పంపులు (రామడుగు వద్ద)
పాత జలాశయాలు: 5 (ఇప్పటికే నిర్మించినవి లేదా సహజమైనవి)
కొత్తగా నిర్మిస్తున్న జలాశయాలు: 20
మొత్తం జలాశయాల నిల్వ సామర్థ్యం: 141 టీఎంసీలు
13 జిల్లాల్లో వచ్చే కొత్త ఆయకట్టు: 18,25,700 ఎకరాలు
శ్రీరాంసాగర్, నిజాం సాగర్, సింగూరుల పాత ఆయకట్టు స్థిరీకరణ: 18,82,970
(18.82 లక్షల ఎకరాల్లో మొత్తంగా 25% నీటి కొరతను పరిగణించి)
కొత్త ఆయకట్టుకు సాగునీరు: 134.5 టీఎంసీలు
శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ ఆయకట్టు స్థిరీకరణ:34.5 టిఎంసిలు
హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా: 30 టీఎంసీలు
దారిపొడవునా ఉండే గ్రామాలకు తాగునీరు: 10 టీఎంసీలు
పారిశ్రామిక అవసరాలకు: 16 టీఎంసీలు
ప్రాజెక్టులో మొత్తం నీటి వినియోగం: 225 టీఎంసీలు
ప్రాజెక్టుకు అవసరమయ్యే మొత్తం భూమి విస్తీర్ణం: 70,326 ఎకరాలు
ఇప్పటిదాకా సేకరించిన భూమి: 36,624 ఎకరాలు
సేకరించవలసిన భూమి: 33,702 ఎకరాలు
మొత్తం అంచనా ఖర్చు: 80 వేల 500 కోట్లు
బ్యాంకులు ఇస్తోన్న లోన్లు: 18 వేల 800 కోట్లు
(ఆధారం: తెలంగాణ ప్రభుత్వం భారీ నీటిపారుదల శాఖ ప్రకారం)

Comments
Post a Comment